కాక్రోచ్ జనతా పార్టీ ఖాతా నిలిపివేత.. కేంద్రానికి, ఎక్స్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

  • కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత 
  • ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
  • తక్షణమే ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలన్న విన్నపాన్ని తిరస్కరించిన హైకోర్టు
మన దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ తాజా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో యువత, సెలబ్రిటీలు ఈ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు, ఈ పార్టీ ఎక్స్ ఖాతాను ఇండియాలో నిలిపి వేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎక్స్ ఖాతాను నిలిపివేయడంపై కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి కారణం లేకుండానే తమ పార్టీ ఖాతాను ఎక్స్ నిలిపి వేసిందంటూ ఆయన పిటిషన్ వేశారు. 

ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. ఈ సందర్భంగా అభిజిత్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... ఎక్స్ ఖాతా నిలిపివేయడం ద్వారా పార్టీ కార్యకలాపాలు, ప్రజలతో సంబంధాలు దెబ్బతింటున్నాయని కోర్టుకు తెలిపారు. వెంటనే పార్టీ ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలని కోరారు. 

ఈ వాదనలపై కోర్టు స్పందిస్తూ... తక్షణమే ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలన్న విన్నపాన్ని తిరస్కరించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, ఎక్స్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 7వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణలోగా కేంద్ర ప్రభుత్వం, ఎక్స్ సంస్థ తమ సమాధానాలను సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది.

Cockroach Janata Party
Abhijit Deepke
Delhi High Court
X account suspension
India politics
Social media ban
Freedom of speech
Justice Purushaindra Kumar Kaurav
IT rules India

More Telugu News